ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకపోవడం వల్లే కాపు జాతి రోడ్డుపైకి వచ్చిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. గుంటూరు జిల్లా వెల్లలూరులో ఇవాళ ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి తమ ఓట్లతో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిందని అన్నారు. తమ జాతిని మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కాకినాడలో జరిగిన సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు. కేంద్రంపై నిరసనగా రకరకాల దీక్షలు, కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు.. తమ జాతి చేస్తున్న దీక్షలు, కార్యక్రమాలకు మాత్రం అనుమతినివ్వకపోవడం విడ్డూరమని ముద్రగడ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన కుమారుడికి రాజాకీయ ఉపాధి కల్పించాడు కానీ కాపులకు మాత్రం కల్పించలేదని విమర్శించారు. తమ ఉద్యమానికి అంబేడ్కర్ మనవడు ప్రకాష్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని ముద్రగడ చెప్పారు.
Total Views: 345 ,